తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద నిర్మాతలు, హీరోలు అందరూ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరెండర్ అయిపోయారు. తెలుగు సినిమా పరిశ్రమపై కనికరం చూపాలని బతిమాలాడుకుంటున్నారు. వివిధ వేదికల నుంచి విన్నపాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున అలా విన్నవించుకున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ నుంచి అదే విజ్ఞప్తి వచ్చింది.
“సినీ పరిశ్రమలో అనేక సమస్యలున్నాయి. వాటిని త్వరగా పరిష్కరించాలి. కరోనా నుంచి ప్రజలను ఎలా రక్షించారో సినీ పరిశ్రమను అలా రక్షించాలి. మీరు తలుచుకుంటే మాకు వరాలు ఇవ్వగలరు,” అంటూ అల్లు అరవింద్ ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు.
“విడుదలయ్యే సినిమాలన్నీ మీ నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి. పరిశ్రమ విజయవంతంగా కొనసాగడానికి మీ సహకారం అవసరం,” అని అన్నారు అరవింద్.
ఆంధ్రపదేశ్ లో టికెట్ రేట్ల సవరణ, 100 శాతంతో థియేటర్లు నడవడం, మొత్తం నాలుగు ఆటలకు అనుమతి రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ తక్షణ అవసరాలు. ఘర్షణ వైఖరితో నష్టమే తప్ప మరేమి లేదని పరిశ్రమ గ్రహించింది. అందుకే, పూర్తిగా బెండ్ అయింది.