
హీరో విజయ్ దేవరకొండకు ఇప్పటికే సొంత బ్యానర్ ఉంది. “కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్స్” బ్యానర్ పై “మీకుమాత్రమే చెప్తా” అనే సినిమా నిర్మించాడు ఈ హీరో. గతేడాది ఈ సినిమా రిలీజైంది. ఆ తర్వాత మళ్లీ నిర్మాతగా సినిమా ప్రకటించని దేవరకొండ, ఇప్పుడు నిర్మాతగా తన రెండో ప్రయత్నంగా వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే తమ బ్యానర్ పై త్వరలోనే ఓ వెబ్ సిరీస్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. అంతేకాదు.. ఈ వెబ్ సిరీస్ లో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. అంతా సెట్ అయిన తర్వాత వెబ్ సిరీస్ ను స్వయంగా విజయ్ ప్రకటించబోతున్నాడు.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెలుగు-హిందీ భాషల్లో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. ఈ గ్యాప్ లో తన బ్యానర్ పై చేయబోయే రకరకాల ప్రాజెక్టులపై విజయ్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఒకటి ఈ వెబ్ సిరీస్.