
విశాల్ పెళ్లి… ఈ వార్త ప్రతి ఆరు నెలలకోసారి చక్కర్లు కొడుతూనే ఉంటుంది. తాజాగా హీరోయిన్ లక్ష్మి మీనన్ తో పెళ్లి ఫిక్స్ అయింది అన్న వార్త వైరల్ అయింది. త్వరలోనే విశాల్ ఈ విషయాన్నీ అఫీషియల్ గా ప్రకటిస్తాడని తమిళ వెబ్ సైట్లు రాశాయి. దాంతో, విశాల్ టీం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
“విశాల్ పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు. దయచేసి అలాంటి నిరాధార వార్తలను నమ్మొద్దు. అలాగే సోషల్ మీడియాలో వాటిని వైరల్ చెయ్యకండి,” అని విశాల్ ఒక ప్రకటన చేశాడు.
లక్ష్మీ మీనన్ తమిళంలో ‘వేదాళం’, “కుంకీ” వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం “చంద్రముఖి 2″లో నటిస్తోంది ఈ 27 ఏళ్ల సుందరి. లక్ష్మీ మీనన్, విశాల్ ఇంతకుముందు “పండియా నాడు” సినిమాలో నటించారు.
విశాల్ పెళ్లి వార్తలు కొత్తేమి కాదు. గతంలో వరలక్ష్మీ శరత్ కుమార్ తో పెళ్లి అన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కి చెందిన నటి అనిషా రెడ్డితో నిశ్చితార్థం కూడా జరిగింది. రీసెంట్ గా నటి అభినయతో పెళ్లి అని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు లక్ష్మీ మీనన్ తో పెళ్లి అనేది వార్త. 45 ఏళ్ల విశాల్ కి పెళ్లి అయ్యేంతవరకు ఇలాంటి ఊహాగానాలు తప్పవేమో.