
శర్వానంద్ తన రేంజ్ పెంచుకోవాలని రకరకాల ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. కానీ అవేవీ వర్క్ అవుట్ కావడం లేదు. ఇంకా చెప్పాలంటే అన్నీ అపజయాలే వరిస్తున్నాయి. 2017లో విడుదలైన ‘మహానుభావుడు’ తర్వాత మరో హిట్ లేదు.
‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’… ఇలా ఉంది ఆయన ఫ్లాపుల పరంపర. ఇంకోటి పడితే డబుల్ హ్యాట్రిక్ అవుతుంది ఫ్లాపుల ఖాతా. కథల ఎంపికలో పొరపాట్లే అతని అపజయాలకు కారణం. తన ఇమేజ్ కి తగ్గ రీతిలో కథలు, సినిమాలు సెట్ చేసుకోవడం లేదు. శర్వానంద్ ని కేవలం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లోనే చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.
అలాంటి సినిమాలు చేస్తేనే కొంత సేఫ్ బెట్. ప్రస్తుతం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వా. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్. ఆమెకి ఉన్న లక్ ట్రాక్, క్రేజ్ హెల్ప్ అయి ఈ సినిమా ఆడితే శర్వానంద్ ఊపిరి పీల్చుకోవచ్చు. ఆమె మరి శర్వా ఫేట్ ని టర్న్ చేస్తుందా?
ఈ సినిమాకి దర్శకుడు కిషోర్ తిరుమల. యావరేజ్, ఎబో యావరేజ్ చిత్రాలు తీస్తారు కిషోర్ తిరుమల. ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్స్ కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.