
సిద్ధూ జొన్నలగడ్డ నటించిన “డీజె టిల్లు” చాలా పెద్ద హిట్. పెట్టిన డబ్బులకు మూడింతలు వచ్చాయి నిర్మాతలకు. ఇక ఆ సినిమాలోని “అట్లుంటది మన తోటి” అనే డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు అందరూ ఆ డైలాగ్ ని వాడేస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది “టిల్లు స్క్వేర్”. ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాట విడుదలైంది.
“”డీజె టిల్లు” సినిమాలో ఒక పాట బాగా పాపులర్ అయింది. రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన “టిల్లు అన్న డీజే పెడితే” అనే పాట చాన్నాళ్లు మార్మోగింది. ఇప్పుడు అదే మీటర్ లో “టికెట్ ఏ కొనకుండా” అనే పాట ఈ సీక్వెల్ నుంచి వచ్చింది. ఈ పాటని కూడా రామ్ మిరియాల స్వరపరచి ఆలపించారు.
మొదటి సినిమా సెంటిమెంట్ ని యాజిటీజ్ గా ఫాలో అయ్యారన్నమాట. మరి ఇది కూడా సీక్వెల్ లానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందా?
“డీజె టిల్లు”కి సిద్దూ జొన్నలగడ్డ కర్త, కర్మ, క్రియ అన్నట్లుగా వ్యవహరించాడు. తానే మాటలు రాశాడు. ఈ సినిమాకి మల్లిక్ రామ్ అనే దర్శకుడు వచ్చాడు. కానీ, ఇక్కడ కూడా షో అంతా సిద్ధూదే. ఈ సీక్వెల్ కి అదనపు ఆకర్షణ అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాలో నేహా శెట్టి తన అందచందాలతో ఆకట్టుకొంది.

అనుపమ పరమేశ్వరన్ కూడా ఇప్పుడు గ్లామర్ షో చేస్తోంది. ముద్దు సీన్లకి కూడా సై అంటోంది. సో, అనుపమ గ్లామర్ కూడా కలిసి వస్తుంది ఈ సీక్వెల్ కి. ఐతే, పాటలు, గ్లామర్ కన్నా నవ్వులు ముఖ్యం ఈ సినిమా సక్సెస్ కి. ఆ విషయంలో సిద్ధూ సక్సెస్ ఐతే ఈ సీక్వెల్ భారీ హిట్ అవుతుంది. మరి ఈ మూవీ అంచనాలు అందుకుంటుందా?