
విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ అనే రెండు సినిమాల్లో నటించాడు శ్రీ విష్ణు (Sree Vishnu). రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో విడుదల అయ్యేందుకు ప్రయత్నించాయి. ఆ ప్రమాదం తృటిలో తప్పింది. ఇప్పుడు ఒక వారం గ్యాప్ లో విడుదల కానున్నాయి. ఐతే, ఇకపై ఇలా చెయ్యొద్దు అని తెలుగు నిర్మాతలు శ్రీ విష్ణుకి సలహా ఇచ్చారు.
“సింగిల్” సినిమాతో మంచి విజయం అందుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు శ్రీ విష్ణు. కామెడీతో సక్సెస్ అయి కింగ్ అఫ్ ఎంటర్టైన్మెంట్ అనే పేరు తెచ్చుకున్నాడు. అతనికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. నిర్మాతలు అందరూ పోటీ పడుతున్నారు సినిమాలు చేసేందుకు. ఐతే, “సింగిల్” సినిమా విడుదలకు ముందే “మృత్యంజయ్”, “విష్ణు విన్యాసం” సినిమాలు ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలకు ఓటిటి డీల్స్ పూర్తి అయ్యాయి.
శ్రీ విష్ణుకి ఉన్న ఇమేజ్ వల్ల ఓటిటి కంపెనీలు కొనేశాయి. వాటిని మార్చి మొదటివారంలోపే విడుదల చెయ్యాలని ఓటిటి కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాంతో, రెండు సినిమాలు ఒకే టైములో విడుదల చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐతే, శ్రీ విష్ణు ఇద్దరి నిర్మాతలను ఒప్పించి రెండు సినిమాల విడుదల మధ్యలో కనీసం ఒక వారం గ్యాప్ ఉండేలా చేశాడు.
ఐతే, ఇకపై ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఇతర నిర్మాతలు విష్ణుకి చెప్పారు. అతను కూడా ఇక సినిమాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను అని తెలిపాడు. హిట్స్ వచ్చినా ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అని శ్రీవిష్ణుకి అర్థమైంది.
