
2022కి ఆదిలోనే హంసపాదు. మళ్ళీ కరోనా వేవ్, మళ్ళీ బ్యాడ్ చిత్రాల పరంపర. మొదటి వీకెండ్ లో అయిదు చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. ఆది సాయికుమార్ హీరోగా రూపొందిన ‘అతిథి దేవో భవ’, రానా, రెజీనా జంటగా తెరకెక్కిన అనువాద చిత్రం ‘1945’ చిత్రాలు ఇందులో ప్రధానమైనవి. దొందూ దొందే.
ఒంటరిగా ఉంటే భయంతో చచ్చే జబ్బు ఉన్న వ్యక్తి ప్రేమలో పడితే ఏమవుతుంది అనే కథతో రూపొందింది ‘అతిథి దేవో భవ’. పాయింట్ మంచిదే. కానీ తీసిన విధానం సహనానికి పరీక్ష పెట్టింది. ఈ సినిమాకి తెలుగుసినిమా.కామ్ 1/5 రేటింగ్ ఇచ్చింది. ఆ రివ్యూ ఇక్కడ చదవొచ్చు.
ఇక ‘1945’ సినిమా మేకర్స్ తో గొడవపడి రానా ఆ సినిమా నుంచి మిడిల్ డ్రాప్ అయ్యాడు. దర్శకుడికి డైరెక్షన్ రాదు అని రానా తిట్టి బయటికి వచ్చారు. అయినా, ఎలాగోలా పూర్తి చేసి వదిలారు మేకర్స్ ఆ చిత్రాన్ని. చూసిన క్రిటిక్స్ ముక్తకంఠంతో 1/5 రేటింగ్ ఇచ్చి తిట్ల దండకం చదివారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ రెండు బోర్ చిత్రాలతో పాటు “హాఫ్ స్టోరీస్”, “వేయి శుభములు కలుగు నీకు”, “ఇది కల కాదు” అనే చిన్న చిత్రాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. ఏ సినిమాకి పది పైసల ఓపెనింగ్ రాలేదు. ఏడాది మొదట్లోనే బ్యాడ్ స్టార్ట్.