
రాజమౌళి తీస్తున్న “వారణాసి” సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒక పాత్రలో రుద్ర అనే యువకుడిగా కనిపిస్తారు. మరో కీలక సన్నివేశంలో రాముడిగా దర్శనమిస్తారు. ఈ విషయం మనకు తెలుసు. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు క్లారిటీగా చెప్పారు.
హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని చెప్పారు.
“నాతో సినిమా చేస్తాను అని చాలా ఏళ్ల క్రితం ఒప్పుకున్నారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం రాజమౌళికి చెల్లింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఫోన్ చేసి కథ రెడీగా ఉందన్నారు. నేనే వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి కథ విన్నాను. కథ వింటే మతిపోయింది. ఇప్పటివరకు రాజమౌళి ఇలాంటి సినిమా చెయ్యలేదు. పౌరాణికం, టైం ట్రావెల్, యాక్షన్ అడ్వెంచర్…. ఇలా అన్ని ఉంటాయి,” అని మహేష్ బాబు అన్నారు.
“ఇక ఒక కీలక ఎపిసోడ్ లో రాముడిగా కనిపిస్తాను. రాముడిగా కనిపించాలంటే ఫిజిక్ మార్చాలి. నిలబడే తీరు వేరుగా ఉండాలి. దానికోసం ఏడాది పాటు ప్రిపేర్ అయ్యాను. ఆ గెటప్ లో మొదటి షాట్ పూర్తి అయ్యేవరకు భయం ఉండేది. అది చూసుకున్నాక నమ్మకం కలిగింది,” అని మహేష్ బాబు వివరించారు.
ఇక మూడు గంటల ఈ సినిమాలో 25 నిముషాలు రామాయణ కాలం ఉంటుంది అని రాజమౌళి వివరించారు. రాముడు లంకలో యుద్ధం చేస్తున్న సన్నివేశాలు ఉంటాయి. ఆ కాలానికి రుద్ర అనే పాత్ర పోషిస్తున్న మహేష్ బాబు, విలన్ గా నటిస్తున్న పృథ్వీరాజ్ వెళ్తారు. “ఆదిత్య 369″లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్లినట్లు.
