
‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాపై ప్రస్తుతం క్రేజీ రూమర్ నడుస్తోంది. చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన ఈ సినిమాను ఇప్పుడు 2 భాగాలుగా విడుదల చేయబోతున్నారట. ముందుగా పార్ట్-1 వస్తుందంట, ఆ తర్వాత 3 నెలలకు పార్ట్-2 వస్తుందంట.
చాలా విచిత్రమైన రూమర్ ఇది. ఎందుకంటే, ముందు నుంచి ‘విశ్వంభర’ సినిమా సింగిల్ మూవీనే. రేపోమాపో విడుదల తేదీ ప్రకటిస్తారని ఎదురుచూస్తున్న టైమ్ లో, ఇలా సినిమాను 2 భాగాలు చేశారంటూ ప్రచారం మొదలవ్వడం విచిత్రమే. అదే కనుక జరిగితే చిరంజీవి కెరీర్ లో 2 భాగాలుగా రాబోతున్న తొలి చిత్రంగా ‘విశ్వంభర’ నిలిచిపోతుంది.
ఈ పుకార్ల సంగతి పక్కనపెడితే, సింగిల్ మూవీగా తీసిన సినిమాను 2 భాగాలుగా రిలీజ్ చేయడం సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ అలా చేయాలనుకుంటే కొన్ని అదనపు సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది. దానికోసం మరోసారి షూటింగ్ మొదలుపెట్టాల్సి వస్తుంది. ప్రాక్టికల్ గా ఇదంతా సాధ్యమా అనే చర్చ మొదలైందిప్పుడు.
పెద్ద సినిమాలపై పుకార్లు రావడం సహజమే. కానీ ‘విశ్వంభర’పై ఇలాంటి ఊహాగానం చెలరేగడం చాలా అసహజంగా ఉంది. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వశిష్ఠ దర్శకుడు.
