
రాజమౌళి తీస్తున్న “వారణాసి” సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అవుతుంది. కానీ ఏడాదిన్నర ముందే టైటిల్ ప్రకటించారు. మరి, అల్లు అర్జున్ నటిస్తున్న తన 22వ చిత్రం (AA22) షూటింగ్ సగభాగం పూర్తి అయింది. ఐనా ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ఈ విషయంలోనే ఫ్యాన్స్ టైటిల్ గురించి అల్లు అర్జున్ పై ఒత్తిడి తెస్తున్నారు.
దాంతో ఈ సినిమా టీం ఈ మూవీ టైటిల్ ప్రకటించాలని నిర్ణయించిందంట. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటిస్తారట. దర్శకుడు అట్లీ తీస్తున్న ఈ భారీ చిత్రంలో అల్లు అర్జున్ ద్విపాత్రిభినయం చేస్తున్నాడు.
దీపికా పదుకోన్ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ కూడా నటించే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.
అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. టైం ట్రావెల్, వింత జీవులు, గ్రహాంతర ప్రయాణాలు… ఇలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థలు ఈ సినిమాకి పని చేస్తున్నాయి. విజువల్స్ అవతార్ రేంజ్ లో ఉంటాయట. సన్ పిక్షర్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి.
