
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా ప్రస్తావించకుండా, తనదైన శైలిలో స్పందించింది అనసూయ (Anasuya Bharadwaj). సినిమాల వల్ల సమాజం మారదని, సినిమాల ద్వారా పిల్లల పెంపకం జరగదని ఆమె అంటోంది.
“సినిమా అనేది ఎప్పుడూ సమాజానికి అద్దంలాంటిదే. అయితే సమాజాన్ని మార్చడం, ప్రజలకు నీతి బోధించడం వంటి మొత్తం బాధ్యతను సినిమాలపై మాత్రమే మోపడం సరైంది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే సినిమా అనేది ప్రధానంగా ఒక కల్పిత కళారూపం. ఏది సరైనది, ఏది తప్పు అనేది గుర్తించే బాధ్యత ప్రతి వ్యక్తికీ ఉంటుంది. పిల్లలను పెంచడం లేదా విలువలు నేర్పడం పూర్తిగా సినిమాల పని కాదు.”
అదే సమయంలో, సినిమాలకు ఎలాంటి బాధ్యత లేదని కూడా తాను అనుకోవడం లేదంటోంది అనసూయ. సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమమని… అది ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను, చర్చలను ప్రభావితం చేస్తుందంటోంది. కొన్నిసార్లు మనుషుల ప్రవర్తనను కూడా ప్రభావితం చేసే శక్తి సినిమాలకు ఉందంటోందామె.
తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన ఆలోచనలు సృజనాత్మకతకు అడ్డుగా మారుతున్నాయనే విమర్శలు కూడా వచ్చాయని చెప్పుకొచ్చింది అనసూయ. అయినప్పటికీ తన నమ్మిన సిద్దాంతాల నుంచి వెనక్కు వెళ్లలేదంటోంది.
స్వేచ్ఛ, బాధ్యత రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని, అవి కలిసి సహజీవనం చేస్తాయని చెప్పుకొచ్చింది అనసూయ. నువ్వెందుకు ఇవన్నీ చెబుతున్నావో మాకు తెలుసని కొంతమంది పోస్టులు పెడుతుంటే.. విషయాన్ని సూటిగా చెప్పుచ్చుకదా అని మరికొందరు అనసూయ పోస్టుపై స్పందిస్తున్నారు.
