
సుఖేష్ చంద్రశేఖర్తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. సుఖేష్ నేర చరిత్ర గురించి తెలిసినప్పటికీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతని నుండి ఖరీదైన బహుమతులు పొందారని చెప్పడానికి ప్రాథమికంగా బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అక్రమ సంపాదనను దాచడంలో ఆమె సుఖేష్ చంద్రశేఖర్తో చేతులు కలిపారని కోర్టు అభిప్రాయపడింది.
మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్-3 కింద జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నేరానికి పాల్పడ్డారని, దీనికి సంబంధించి తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని జడ్జి స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీన నిందితులు తమపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా లేదా అని కోర్టుకు తెలియజేయాల్సి ఉంటుంది.
సుఖేష్ చంద్రశేఖర్ నేర చరిత్ర గురించి నిందితులు పింకీ ఇరానీ, లీపాక్షి ఎల్లావాడి ద్వారా బాగా తెలిసినప్పటికీ, జాక్వెలిన్ అతడి నుండి రూ.5,71,11,942 విలువైన బహుమతులు స్వీకరించినట్లు కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా, ఆమె సోదరికి చెందిన విదేశీ బ్యాంక్ ఖాతాలోకి 1,72,913 యూఎస్ డాలర్లు, అలాగే ఆమె సోదరుడి విదేశీ బ్యాంక్ ఖాతాలోకి 26,740 ఆస్ట్రేలియన్ డాలర్లు బదిలీ అయినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే జాక్వెలిన్, తన తల్లిదండ్రులకు కార్లు కొనుగోలు చేసినట్టు అధికారులు కోర్టుకు తెలిపారు. తను కార్లు కొనుగోలు చేసిన విషయాన్ని జాక్వెలిన్ కూడా అంగీకరించినట్టు వెల్లడించారు. ఛార్జ్ షీట్ రెండో సప్లిపెంట్ లో జాక్వెలిన్ కు వ్యతిరేకంగా నమోదైన వ్యక్తుల స్టేట్ మెంట్లు, బ్యాంక్ ఖాతా వివరాలు, కాల్ డేటాను కోర్టు పరిశీలించి, ఆమెపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.
