
నటి ప్రీతి జింటా (Preity Zinta) కి ఇప్పుడు 50 ఏళ్ళు. ఆమె కూడా బాధితురాలు అంట. తన అనుమతి లేకుండా సృష్టించిన ఏఐ డీప్ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫొటోలను ఇంటర్నెట్లో పెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ ప్రీతి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ‘ప్రీతి జింటా వర్సెస్ గూగుల్’ పేరుతో ఈ కేసు నమోదైంది.
ఈరోజు ఈ కేసు విచారణకు రాగా, ఆన్లైన్ నుంచి ఈ ఏఐ కంటెంట్ను తొలగించడానికి ఒక విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ప్రక్రియపై అన్ని పార్టీలు సంయుక్తంగా పనిచేయాలని సూచిస్తూ, 6వ తేదీన తీర్పు ఇస్తామని వెల్లడించారు.
తన కేసులో గూగుల్ తో పాటు మెటా లాంటి సంస్థల్ని చేర్చింది ప్రీతి జింటా. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో తన ఏఐ డీప్ ఫేక్ వీడియోలు విపరీతంగా కనిపిస్తున్నాయని. కొంతమంది ఈ వీడియోలతో చాట్ బాట్ ఇంటరాక్షన్లు కూడా నిర్వహిస్తున్నారని కోర్టుకు తెలిపింది ప్రీతి జింటా.
రూల్స్ కు విరుద్ధంగా సోషల్ మీడియాలో చలామణి అవుతున్న తన ఏఐ కంటెంట్ ను తక్షణం డిలీట్ చేయాలని ఆమె కోరింది. ఈ మేరకు కొన్ని వెబ్ సైట్లను కూడా ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ వాదనలపై గూగుల్, మెటా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ, ప్రీతి జింటాకు చెందిన అసభ్యకరమైన ఏఐ మెటీరియల్ ను తొలగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు. అయితే, ఉల్లంఘనలు జరక్కముందే గుర్తించడం సాధ్యంకాదని, అంత టెక్నాలజీ తమ దగ్గర లేదని కోర్టుకు తెలిపారు.
