
ఒకసారి తప్పు మాట్లాడితే పోనిలే ఎదో నోరు జారాడులే అని ఊరుకుంటారు. రెండో సారి కూడా మాట తూలితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అని సన్నిహితులు చెప్తారు. మూడోసారి మాట్లాడితే కోపం తెచ్చుకుంటారు. నాలుగోసారి చేస్తే చిరాకు పడుతారు. అదే రిపీట్ చేస్తే ఎదురు తిడుతారు, గట్టిగా కౌంటర్ ఇస్తారు, ట్రోల్ చేస్తారు. ఇంకా చాలా చేస్తారు. అదే జరిగింది రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) విషయంలో.
ఇటీవలే పద్మశ్రీ బిరుదు కూడా తెచ్చుకున్న రాజేంద్రప్రసాద్ మరోసారి (ఎన్నోసారి అని అడగొద్దు) మాట తూలి క్షమాపణ చెప్పారు. తమిళనాట గగ్గోలు పెట్టడంతో ఎంజీఆర్ (MGR) విషయంలో తప్పుగా మాట్లాడాను క్షమించండి అని తమిళ్ లోనే వేసుకోవాల్సి వచ్చింది రాజేంద్రుడి.
నటుడు కాంతారావు గురించి గొప్పగా చెప్పే ప్రయత్నంలో కాంతారావు చేసిన జానపద పాత్రలు చూసి ఎంజీఆర్ “ఉచ్చ పోసుకునేవాడు” అని మాట్లాడి విమర్శల పాలు అయ్యారు రాజేంద్రుడు. దాంతో తాజాగా క్షమాపణ కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.
“ఎంజీఆర్ తమిళ సినిమాకు దేవుడు. తమిళ జనాలు ఆయన్ని ఎలా చూస్తారో నాకు తెలుసు. ఎంజీఆర్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. పొరపాటున మాట తూలాను,” అని క్షమాపణలు చెప్పారు.
ఇలా సారీ చెప్పడం రాజేంద్రప్రసాద్ కి మొదటిసారి కాదు. అనేకసార్లు స్తేజ్ పై “ఫ్లో”లో మాట్లాడెయ్యడం, తర్వాత సానుభూతి కోసం ఎదో “కవరింగ్” మాటలు చెప్పడం అలవాటు అయిపొయింది ఈ సీనియర్ నటుడికి. పదే పదే అదే పద్దతా?
