
తెలుగు ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు బంపరాఫర్ ఇచ్చారు. ఇకపై తమ థియేటర్లలో ఏ సినిమాకూ టికెట్ రేట్ల (Ticket Rates) పెంపు ఉండదని ప్రకటించారు. అయితే ఇక్కడో చిన్న మెలిక. సింగిల్ స్క్రీన్స్ కు కూడా మల్టీప్లెక్సుల తరహాలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
పర్సంటేజీ విధానం అమలు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏ సింగిల్ స్క్రీన్ లో, ఎంత పెద్ద సినిమా రిలీజైనా, టికెట్ రేట్లు పెంచమని నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ శిరీశ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు జారీ చేసినా, సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శిస్తామంటున్నారాయన.
మల్టీప్లెక్సుల తరహాలో సింగిల్ స్క్రీన్స్ కు కూడా పర్సంటేజీ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎగ్జిబిటర్లు. తమకు కూడా పర్సంటేజీలిస్తే, సింగిల్ స్క్రీన్స్ లో సౌకర్యాల్ని మెరుగుపరుస్తామని, డాల్బీ-డీటీఎస్ లాంటి టెక్నాలజీల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ టైమ్ లో చేసిన ఆందోళనకు, ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi) సినిమా రిలీజ్ టైమ్ లో మళ్లీ మొదలైన వివాదానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎగ్జిబిటర్లు. తాము ఏళ్లుగా పర్సంటేజీ విధానం కోరుతున్నామని, ఈ గ్యాప్ లో చాలా పెద్ద సినిమాలొచ్చాయని చెబుతున్నారు.
